రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్లో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పోలింగ్కు ముందు రోజు పేలుడు సంఘటనలు జరిగాయి. పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన పేలుళ్లలో 25 మంది మరణించారు. నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్లో బుధవారం ఈ సంఘటన జరిగింది.
గురువారం పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. సరిగ్గా దానికి ఒక రోజు ముందు బాంబు పేలుళ్లు సంభవించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నివాసాల సమీపంలో ఈ బాంబు పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది. ఈ బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సంతాపం తెలిపారు.
అయితే మొత్తం ఇప్పటివరకు రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లు జరిగినట్లు పాక్ మీడియా వెల్లడించింది. పాక్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ నివసించే పిషిన్ జిల్లాలో జరిగిన మొదటి పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలిపింది.
ఇక ఈ పేలుడు జరిగిన అరగంట లోపే మరో బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు. ఖిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్ ఉలేమా ఇస్లాం పాకిస్థాన్ ఎన్నికల కార్యాలయం బయట మరో బాంబు పేలింది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరో 12 మంది గాయపడినట్లు తెలిపారు.
ఈ దాడుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టం కాలేదు. అయితే ఉగ్రవాదులు, బబూచిస్థాన్ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్లో గురువారం జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పేలుళ్ల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ నివాసం ముందు ఒక బ్యాగును ఉంచారని.. అందులో ఉన్న బాంబును రిమోట్ సాయంతో పేల్చినట్లు బలచిస్తాన్లోని పంజ్గుర్ సీనియర్ పోలీస్ అధికారి అబ్దుల్లా జెహ్రీ వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు క్వెట్టా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు లభ్యం అయ్యాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్ స్టేషనన్కు వెళ్లి ఓట్లు వేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని.. అబ్దుల్లా జెహ్రీ తెలిపారు. అయితే ఏం జరిగినా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని మరింత పెంచుతున్నట్లు చెప్పారు. ఇక ఖిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని ఎన్నికల కార్యాలయం వద్ద జరిగిన మరో పేలుడులో జేయూఐ పార్టీ అభ్యర్థి మృతి చెందారని.. ఇది చాలా నష్టం కలిగించిందని పేర్కొన్నారు.