బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే పోలీసులు జడ్జి నివాసంలో హాజరుపరిచారు. ఈనెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రహేల్ను చెంచల గూడా జైలుకు తరలించారు.
గతేడాది ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో రాహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. యాక్సిడెంట్ అనంతరం దుబాయ్ పారిపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దుబాయ్ నుంచి తిరిగి ఇండియాకు వస్తుంటే పోలీసులు ఎయిర్పోర్టులో అదుపులో తీసుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి రాహిల్ మద్యం సేవించి అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసు నుంచి రాహిల్ను తప్పించడానికి మహారాష్ట్రకు చెందిన అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిని పంజాగుట్ట పోలీస్స్టేషన్కు పంపి కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో లభించిన కాల్డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయటంతోపాటు అరెస్టు చేసి విచారించారు. మెుత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితులను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.