రాజధాని అమరావతి నిర్మాణాకి కేంద్ర బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం కమిటీని నియమించింది.
వివిధ శాఖల ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్గా ఉంటారు. సభ్యులుగా రహదారులు, భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు ఉంటారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాల్ని పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని కోరింది.
వివిధ నిర్మాణాల పటిష్టత, స్థితిగతుల్ని పరిశీలించి కమిటీ సిఫార్సులు చేయనుంది. రాజాధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపులైన్లు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని ఆమె ప్రకటించారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయాన్ని బడ్జెట్లో కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. కేంద్రబడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రకటించిన రూ.15వేల కోట్ల ఆర్ధిక సాయంపై నెలకొన్న సందిగ్దతపై నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు.
ఈ రూ.15 వేల కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుని, వివిధ ఏజెన్సీల ద్వారా అమరావతి నిర్మాణానికిి తోడ్పాటును అందిస్తామని ఆమె వెల్లడించారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అయితే, ప్రస్తుతం ఏపీ ఈ రుణాన్ని చెల్లించే పరిస్థితిలో లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
