ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో తాజాగా నిరసనలు పతాకస్థాయికి చేరడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే ప్రధానమంత్రి కార్యాలయం వీటిని ఖండించింది.
శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత ఆర్థిక సంక్షోభం ఎన్నడూ నెలకొనలేదు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించమని శ్రీలంక- అంతర్జాతీయ ద్రవ్య నిధిని, రుణాలివ్వమని భారత్ను, చైనాను కోరుతున్నది.తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని పంపింది. బియ్యం కూడా పంపింది.
కర్ఫ్యూ ధిక్కరిస్తూ శ్రీలంకలో భారీ నిరసనలు
శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపును నిరసిస్తూ ఒక వంక ప్రతిపక్షాలు, మరోవంక విద్యార్థులు భారీ నిరసనలు జరుపుతున్నారు. దానితో ఆర్ధిక సంక్షోభంకు రాజకీయ సంక్షోభం తోడయి పరిస్థితులు దిగజారుతున్నాయి. సుస్థిరతను అందిస్తానంటూ 2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రాజపక్షకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం మారుతోంది.
శ్రీలంకలో దిగజారిన ఆర్థిక సంక్షోభంకు నిరసనగా ప్రభుత్వం విధించిన వారాంతపు కర్ఫ్యూను కాండీలో వందలాది మంది విద్యార్థులు ఉల్లంఘించారు. ఆ దేశం విద్యుత్ కోతలు, ఆహారం, ఇంధనం, నిత్యావసరాల కొరతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను ధిక్కరించిన నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగించారు.
కొలంబోలో విపక్ష నాయకుల ప్రదర్శనలో వందలాది మంది చేరారు. అయితే వారిని ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస ఇంటి వద్ద పోలీసులు, సైనికులు ఆపేశారు. ఇదిలావుండగా శ్రీలంకలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి వాటిని శనివారం నుంచి బ్లాక్ చేశారు.
శ్రీలంకలో కర్ఫ్యూను శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విధించారు. కర్ఫూను ఉల్లంఘించిన దాదాపు 664 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. పబ్లిక్ ఆర్డర్ను పరిరక్షించడానికే దేశంలో ఎమర్జెన్సీని విధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స సమర్థించుకున్నారు.