అమెరికాలో స్థిరపడిన ప్రవాస వైద్యులు మాతృ భూమికి సేవలు చేయాలనే మహత్తర ఆశయంగా ప్రారంభించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ ఆసుపత్రిగా వెలుగొందుతున్న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీ కుంభకోణం బహిర్గతమైనది. ఇద్దరు డైరక్టర్లు, మరొ ఇద్దరు కీలక వ్యక్తులతో కుమ్మక్కై, లెక్కలను తారుమారు చేసి, రూ 50 కోట్లకు పైగా స్వాహా చేసినట్టు బయటపడింది.
ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ మణి అక్కినేని, ఛీప్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ ఉప్పల శ్రీనివాసరావు, చీఫ్ పైనాన్సింగ్ ఆఫీసర్ నళిని మోహన్…ఓ గ్యాంగ్గా ఏర్పడి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎన్ఆర్ఐ ఆకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ నిధులతోపాటు కరోనా సమయంలో రోగుల చెల్లింపుల్లో గోల్మాల్కు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది.
కరోనా సమయంలో నకిలీ ఇన్వాయిస్లతో అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. సెప్టెంబర్ 24, 2020న ఒక రిటైర్డు జస్టిస్, ఆయన సతీమణిని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరారు. చికిత్స నిమిత్తం రూ 2 లక్షల అడ్వాన్స్ చెల్లించారు. వైద్యనిమిత్తం ఖర్చు చేసిన మొత్తాన్ని తెలంగాణ హైకోర్టు, ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చెల్లించింది.
ఈ క్రమంలో అడ్వాన్స్ చెల్లింపును తిరిగి ఇవ్వాలని ఆ రిటైర్డ్ జస్టిస్ అడగడంతో, ఆయన అడ్వాన్స్ మొత్తం అకౌంట్స్ రికార్డ్స్లో నమోదు చేయలేదని వెల్లడయ్యింది. ఆస్పత్రి చెల్లింపు పుస్తకాన్ని పరిశీలించగా రిటైర్డు జస్టిస్ చెల్లించిన రూ 2 లక్షలు, మరో హెచ్ఐఎంఎస్ బుక్లో రికార్టు అయ్యింది.
దీంతో మొత్తం రోగుల వివరాలు చెల్లింపులపై విచారించగా, భారీ అవకతవకలు వెలుగుచూశాయి. సుమారు 1500 మంది రోగుల రికార్టులను ఎన్ఆర్ఐ అకౌంటెంట్ విభాగం కంప్యూటర్లో ఎంటర్ చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆ తరువాత జరిపిన అంతర్గత విచారణలో నకిలీ రికార్డులతో కోట్లు రూపాయలను దారి మళ్లించినట్లు తేలింది.
మరో వైపు ఎన్ఆర్ఐ ఎఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని సృష్టించిన డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ మణి, అక్కినేని నకిలీ ఇన్వాయిస్లను తయారు చేసి ఎన్ఆర్ఐకి చెందాల్సిన రూ 62.72 లక్షలను స్వాహా చేసినట్లు తేలింది.
అంతటితో ఆగకుండా కోవిడ్ ఇన్సోలేషన్ వార్డ్ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, ఇన్ ప్రాస్టక్చర్ మొబెలైజెషన్ కోసం మంజూరు చేసిన రెండు కోట్లు రూపాయలను, ఫేక్ కంపెనీ అకౌంట్ ద్వారా పక్కదారి మళ్లించినట్లు నిర్థారణ అయ్యింది.
ఓ భవన నిర్మాణ సంస్థ రత్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కు రూ 33 కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ సంస్థకు ఏప్రిల్ 2019 లో రూ 4 కోట్లు అడ్వాన్స్ చెల్లించారు. ఈ బిల్డింగ్కు సంబంధించిన కట్టడం కానీ, ఇప్పటికి ఎలాంటి సివిల్ వర్క్ కూడా జరగలేదని తేలింది.
మరోవైపు మెడికల్ కాలేజీ యాజమాన్యం కోటాలో సీట్లను అక్రమ మార్గంలో అమ్ముకొని అక్రమాలకు పాల్పడినట్లు కూడా తేలింది. అంతేకాదు, డాక్టర్ మణి అక్కినేని విజయవాడలోని తన సొంత ఆసుపత్రికి ఖరీదైన పరికరాల కోసం డమ్మీ కొనుగోలు ఆర్డర్లు ద్వారా ఎన్నారై ఆసుపత్రి సొమ్మును రూ.75 లక్షలు క్లియర్ చేసినట్లు తేలింది.
ఈ గ్యాంగ్ మోసాలపై ఎన్ఆర్ఐ ఆస్పత్రి అంతర్గత విచారణ చేపట్టిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ అవకతవకలపై చార్జిషీటు దాఖలు చేశారు.