బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థుల వారం రోజులుగా జరుపుతున్న ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా భారీ వర్షంలో గతరాత్రి వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు.
ఇప్పటికే నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు రెండుసార్లు విద్యార్థులతో చర్చించి విఫలమయ్యారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాసర చేరుకున్నారు. ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ రాహుల్ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్కుమార్ తదితరులు క్యాంపస్కు వచ్చారు.
తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.
ఈ సందర్భంగా నెలరోజుల్లో డిమాండ్లన్నింటినీ తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. ‘సంబంధిత మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలి’ అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు.
ఆర్జీయూకేటీ విద్యార్థులు ఏడు రోజులుగా పట్టుదలతో ఆందోళన కొనసాగించారు. ఆదివారం రోజంతా ఎండలో, రాత్రంతా చలిలో ఆరు బయటే నిద్రించి నిరసన తెలిపారు. సోమవారం వేకువజామునే మేల్కొని అంతా కలిసి యోగా చేశారు. తర్వాత ఆర్జీయూకేటీ ప్రాంగణంలోనే రాత్రి వరకు నిరసన కొనసాగించారు.
ఆర్జీయూకేటీ విద్యార్థి పాలక మండలి సభ్యులు సోమవారం తమ డిమాండ్లపై యూట్యూబ్ లైవ్ ద్వారా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే చాన్సలర్ను నియమించాలని, సెర్చ్ కమిటీ వేసి వైస్ చాన్సలర్నూ ఎంపిక చేయాలని, ఫైనాన్స్ ఆఫీసర్ను నియమించాలని కోరారు.
విద్యార్థుల అవసరాల కోసం కేటాయించే 312 గ్రాంట్లు 2019 నుంచీ రావడం లేదని.. వీటిని ఇవ్వడంతోపాటు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును కోరారు. బడ్జెట్ లేనందునే తమకు ల్యాప్టాప్, యూనిఫాం, స్పోర్ట్స్వేర్, బెడ్లు ఇవ్వడం లేదని చెప్పారు.
ఎనిమిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు 17 మందేనని.. మిగతా 170 మంది కాంట్రాక్టు వాళ్లు ఉన్నారని, వెంటనే సరిపడా అధ్యాపకులను నియమించాలని కోరారు. క్యాంపస్లో కేవలం ఇద్దరు మాత్రమే పీఈటీలు ఉన్నారని, విద్యార్థినులకు ప్రత్యేకంగా మహిళ పీఈటీని నియమించాలని కోరారు. 24 గంటల పాటు లైబ్రరీ, షాపింగ్ కాంప్లెక్స్లతోపాటు మంచి క్యాంటిన్ కావాలని కోరారు. ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ తదితర సమస్యలు, హాస్టల్ గదుల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇలా ఉండగా, బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సోమవారం డిమాండ్ చేసింది.
9000 మంది విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా పోలీసుల నిర్బంధంతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.