అత్యవసర వినియోగానికి మరో రెండు కోవిడ్ వ్యాక్సిన్లకు డిసిజిఐ అనుమతినిచ్చింది. కరోనా వైరస్కు వ్యతిరేకంగా దేశీయంగా తయారైన ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతినిచ్చింది.
జెన్నోవా బయో-ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన ఈ టీకాను 18 ఏళ్లు నిండినవారికి అందించవచ్చని తెలిపింది. ఇతర ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ డోసుల మాదిరి వీటిని జీరో ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదు. 2-8 డిగ్రీల వద్ద కూడా జెన్నోవా వ్యాక్సిన్ను నిల్వ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
7-11 ఏళ్ల వయసు చిన్నారుల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారుచేసిన కొవొవాక్స్ టీకాకూ డిసిజిఐ అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్ఐఐలో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్కుమార్ సింగ్ ఈ ఏడాది మార్చి 16 న దరఖాస్తు చేశారు.
దీన్ని పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ.. అత్యవసర వినియోగం నిమిత్తం కొవొవాక్స్కు అనుమతి ఇవ్వొచ్చని సూచించింది. ఈ మేరకు చిన్నారులకు వినియోగించేందుకు ఆమోదం తెలిపినట్టు డిసిజిఐ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
గర్భాశయ క్యాన్సర్ను అడ్డుకునేందుకు సీరం సంస్థ తయారుచేసిన ‘సెర్వావాక్’ టీకాకు ఆమోదం తెలపాలని వ్యాక్సినేషన్కు సంబంధించిన జాతీయ సాంకేతిక సలహా బఅందం (ఎన్టిఎజిఐ) కేంద్రానికి సిఫారసు చేసింది. త్వరలోనే డిసిజిఐ దీనికి ఆమోదముద్ర వేసే అవకాశముంది. మరోవైపు- టైఫాయిడ్ను అడ్డుకునే మరో వ్యాక్సిన్కూ ఆమోదం తెలపాలని ఎన్టిఎజిఐ సిఫారసు చేసినట్టు సమాచారం.