మే నెలలో 19 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించినట్టు మెటా సారధ్యంలోని మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ప్రకటించింది. వాట్సప్ గ్రీవెన్స్ ఛానల్ నిబంధనల అతిక్రమణలను గుర్తించే సొంత వ్యవస్థల ద్వారా యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా నిషేధం విధించినట్టు వివరించింది.
ఈ మేరకు మే నెల ‘యూజర్-సేఫ్టీ’రిపోర్టులో వాట్సప్ ప్రతినిధి వెల్లడించారు. అందిన ఫిర్యాదులు.. వాటిపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్టులో పేర్కొన్నామన్నారు. ఇండియన్ వాట్సప్ ఖాతాలను నంబర్కు ముందు ఉండే +91 ద్వారా గుర్తించొచ్చని పేర్కొన్నారు.
శుక్రవారం విడుదలైన యూజర్- సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం.. మే 1 నుంచి మే 31,2022 మధ్యకాలంలో 19.10 లక్షల భారతీయుల వాట్సప్ ఖాతాలపై నిషేధపు వేటుపడింది. యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అందిన తర్వాత చర్యలు తీసుకున్నారు.
కాగా అంతక్రితం నెల ఏప్రిల్లో 16 లక్షల ఖాతాలు, మార్చి నెలలో 18.05 లక్షల ఖాతాలపై వాట్సప్ బ్యాన్ విధించింది. డూప్లికేట్ ఫిర్యాదులు మినహా మిగతావాటన్నింటిపైనా చర్యలు తీసుకున్నట్టు వాట్సప్ ప్రతినిధి చెప్పారు. ఫిర్యాదును బట్టి అకౌంట్పై నిషేధం లేదా గతంలో నిషేధించిన అకౌంట్ పునరుద్ధరణ జరిగాయని వెల్లడించారు.
గతేడాది నూతనంగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. 50 లక్షలకుపైగా యూజర్లను కలిగివున్న డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ నెలవారీగా ఫిర్యాదుల వివరాలను ప్రకటించారు. అయితే, అందిన ఫిర్యాదు, తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సి ఉంటుంది.