కరోనాను అడ్డుకునే నాసల్ వ్యాక్సిన్ ‘బీబీవీ154’ మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్ వెక్టార్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
‘వాషింగ్టన్ యూనివర్శిటీ ఇన్ సెయింట్ లూయిస్’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని, ఇది పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు వెల్లడించింది.
దేశ స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీబీవీ154 టీకా విజయవంతమైందని ప్రకటించినందుకు గర్వపడుతున్నామని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ట్విటర్లో పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి దేశాలకు అతి తక్కువ వ్యయంతో టీకాను అందించాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సాయంతో భారత ప్రభుత్వం ఈ టీకా అభివృద్ధి , ప్రయోగాలకు సహకరించినట్లు వివరించారు. బీబీవీ154 టీకాను ప్రాథమిక డోస్గా, బూస్టర్ డోస్గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలను నిర్వహించామని, 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ వ్యాక్సిన్ను భద్ర పర్చి సులభంగా రవాణా చేయవచ్చని తెలిపారు.