రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపోవడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట వాపోయారు. ఆదివారం బేగంపేటలో అమిత్ షా ఆదర్శ రైతులతో సమావేశమయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన 17 మంది ఆదర్శ రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మరికొందరు కిసాన్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో సేంద్రీయ వ్యవసాయంవల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఫసల్ బీమా అమలు పథకంపైనా చర్చించారు.
దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లుతున్నా తమకు పరిహారం అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ తనకు గతంలో 10 ఎకరాల భూమి ఉండగా.. వ్యవసాయంవల్ల తీవ్రంగా నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.
దీంతో కొంత భూమిని అమ్మేసి సేంద్రీయ వ్యవసాయం ఆరంభించానని, సేంద్రీయ వ్యవసాయంతో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా కరోనా సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు తన వద్దకు వచ్చి సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి తీసుకెళ్లారని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తాను కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తనకున్న 20 ఎకరాల్లో తెలీకుండా రసాయన ఎరువులు వాడటంతో పంట దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు.
తన వద్ద దగ్గర మేలు జాతి (ఇక్కీస్) గోవులున్నాయని, అందులో ఒకటి ఒక గోమాత 12వ జనరేషన్ కు చెందినదని తెలిపారు. ఆ గోమాతకు మహాలక్ష్మీగా నామకరణం చేసి మనవుడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని అమిత్ షా వివరించారు. గోమాత పేడను సేంద్రీయ ఎరువులుగా వాడటంవల్ల ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వెనుకబడి ఉన్నామంటూ కొందరు రైతులు అమిత్ షా ద్రుష్టికి తీసుకురాగా… అతి త్వరలోనూ అమూల్ సంస్థ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్ లో తగిన ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా హైదరాబాద్ లో 5 సేంద్రీయ వ్యవసాయ లాబోరేటరీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులపై పరీక్షలు చేయడంతోపాటు సేంద్రీయ ఉత్పత్తులు పండించే భూముల్లో ఏటా రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
