మంత్రి జగదీశ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా మాట్లాడొద్దని, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించింది.
శనివారం సాయంత్రం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జగదీశ్రెడ్డి అన్నారని బీజేపీ చేసిన ఫిర్యాదు చేయగా.. తొలుత మంత్రి నుంచి వివరణ కోరింది ఎలక్షన్ కమిషన్.
అయితే మంత్రి జగదీశ్రెడ్డి ఇచ్చిన వివరణ సహేతుకంగా లేదన్న కారణంతో ఈసీ ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా మంత్రిగా జగదీశ్రెడ్డి ఈ సభకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
ఫాంహౌస్ కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్
మరోవంక, టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఫరీదాబాద్కు చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్కు చెందిన నందకుమార్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు.
అంతకుముందు నిందితులను మధ్యాహ్నం షేక్పేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మొయినాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన అనంతరం సరూర్నగర్లోని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
ఈ కేసు విచారణను నవంబర్ 4వ తేదీ వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ మేజిస్ట్రేట్ నిందితులు ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.