మునుగోడు ఉప ఎన్నిక సందడి నడుస్తున్న క్రమంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మంత్రి జగదీశ్ పీఏ ఇంట్లో ఐటీ దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. నల్గొండలో గల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఐటీ అధికారుల బృందం చేరుకుంది.. అక్కడ సోదాలు ఐదు గంటల సేపు సోదాలు జరిపి రూ 49 లక్షల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐటీ అధికారులు సోదాల కోసం ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ విషయం తెలిసి హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే.. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నగదు ఉందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారని వార్తలు వస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం గడువు మంగళవారంతో ముగుస్తుండగా, సోమవారం సాయంత్రం 6 గంటల నుండి సోదాలు జరిగాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశామని అధికారులు తెలిపారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ హై కమాండ్ జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్నారు.
అయితే రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ విషయం అలా ఉండగా ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దానికి ప్రభాకర్రెడ్డి స్పందిస్తూ తాను వ్యవసాయం చేస్తానని, పంటపై వచ్చిన ఆదాయం ఆ మొత్తమని వివరణ ఇచ్చినట్లు సమాచారం. రెండ్రోజుల్లో ఐటీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నట్లు తెలిసింది.