బాలీవుడ్ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్మప్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. కాంతార, పుష్ప చిత్రాలపై అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఘాటుగా ట్వీట్ చేశారు.
కాంతార, పుష్ప లాంటి చిత్రాలు సినీ పరిశుమను నాశనం చేస్తున్నాయంటూ అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు వివేక్ స్పష్టం చేశారు. బాలీవుడ్కు చెందిన ఏకైక న్యాయమూర్తి అభిప్రాయాలతో తాను పూర్తిగా విభేదిస్తున్నానంటూ ఆయన ఎద్దేవా చేశారు.
దీనికి గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కౌంటర్ ఇస్తూ పరిశోధన చేసి సినిమాలు తీయడం నేర్చుకోవాలంటూ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి హితవు చెప్పారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ తాను 4 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి కశ్మీర్ ఫైల్స్ తీశానని, తన చిత్రంలోని పాత్రలు, 700 మంది కశ్మీరీ పండిట్ల వీడియో అన్నీ అబద్ధాలేనా? అక్కడ హిందువులు చనిపోలేదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
తాను తీసింది అవాస్తవాలైతే రుజువు చేయాలని, తాను దోబారా(మరోసారి) అటువంటి తప్పు చేయనని వివేక్ కౌంటర్ ఇచ్చారు. తాప్సీ పన్ను కథానాయికగా అనురాగ్ కశ్యప్ ఇటీవల నిర్మించిన దోబారా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన విషయాన్ని పరోక్షంగా ఎత్తిపొడవడం విశేషం.