చైనాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. కరోనా ధాటికి ప్రాణాలుకోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకూ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. శవాలతో దహన వాటికలు కిక్కిరిసిపోతున్నాయి. మృతదేహాలతో బాధిత కుటుంబాలు బారులు తీరుతున్నారు. ఈ మేరకు హృదయ విదారక దృశ్యాలు నమోదైన వీడియోను ఆరోగ్య నిపుణుడు ఫెజిల్ డింగ్ సోషల్మీడియాలో షేర్ చేశారు.
మృతదేహాల దహన సంస్కారాలకు కొన్ని గంటల సమయం పడుతుంది. కరోనా చైనాలో విరుచుకు పడుతుండటంతో ఆసుపత్రుల్లో మిలియన్ల పేషెంట్లు చేరుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు చైనా దేశవ్యాప్తంగా వద్ద పొడవాటి క్యూ కడుతుండటం దుర్భర స్థితికి అద్దం పడుతోంది.
హెల్త్ ఎక్స్పర్ట్ ట్విట్టర్లో షేరు చేసిన వీడియో వీక్షకుల హృదయాలను కలిచివేస్తోంది. చైనాలోని ప్రభుత్వ మీడియా కూడా నిర్దిష్ట టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించలేక పోతుంది. సగానికిపైగా సిబ్బంది బారిన పడటమే దీనికి కారణమని ఎరిక్ ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీని విరమించుకుంది. దీంతో కరోనా వైరస్ చైనా దేశవ్యాప్తంగా శరవేగంతో విస్తరించింది. బాధితులు కుప్పలుతెప్పలుగా నమోదవుతుండటంతో పరిస్థితి విషమంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు శవాలతో బారులు తీరి గంటలపాటు దహన సంస్కారాల కోసం వేచి చూస్తున్నారు.
డిసెంబర్ 1నుంచి మరోసారి కరోనా మహమ్మారి విజృంభించడంతో వైరస్ బారినపడిన అనేక మంది మృత్యువాత పడుతున్నారు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 248 మిలియన్ మంది ప్రజలు కొవిడ్ బారిన పడ్డారు. చైనా దేశ జనాభాలో 17.56 శాతంగా పేర్కొన్నారు. డిసెంబర్ 1నుంచి 20వ తేదీ మధ్య కరోనా బాధితులుగా మారారని కేంద్రంగా ఉన్న దక్షిణ చైనా మార్నింగ్పోస్టు నివేదించింది.
మరోవంక, దాదాపు మూడు సంవత్సరాల కఠినమైన ఆంక్షల తర్వాత చైనా సడలింపులు ప్రకటించింది. జనవరి 8 నుండి చైనాకు వచ్చే విదేశీ ప్రయాణికులకు నిర్బంధ చర్యలను రద్దు చేయనున్నట్లు ఆరోగ్య అధికారులు సోమవారం ప్రకటించారు. జాతీయ ఆరోగ్య కమిషన్ కోవిడ్-19 కోసం డౌన్గ్రేడ్ చేసిన నియంత్రణ చర్యలను ఆన్లైన్ నోటీసులో ప్రకటించింది. ప్రయాణికులు చైనాలోకి ప్రవేశించడానికి 48 గంటల విమానానికి ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది.
జాతీయ ఆరోగ్య నిర్బంధ చట్టం ప్రకారం, ఇన్బౌండ్ ప్రయాణికులు, వస్తువులపై అంటు వ్యాధి నిర్బంధ చర్యలు ఇకపై తీసుకోబడవు అని నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సి) తెలిపింది. అంతర్జాతీయ విమానాల సంఖ్యను పరిమితం చేసే పరిమితులు కూడా రద్దు చేయబడతాయని నోటీసు పేర్కొంది. జనవరి 8 నుండి ఈ చర్యలు అమలులోకి వస్తాయి అని నోటీసులో తెలిపింది.