రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని దేశాలు తమపై కరోనా ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదని చైనా స్పష్టం చేసింది. శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కరోనా ఆంక్షలు విధిస్తున్నారని మండిపడింది.
ఈ చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా నిబంధనలను ప్రయోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ తేల్చి చెప్పారు. ఈ చర్యల్లో కొన్ని అసమానమైనవి, ఆమోదయోగ్యం కానివి ఉన్నాయని పేర్కొన్నారు.
తమ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడంపై చైనా తీవ్రంగా మండిపడింది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి వచ్చేటోళ్లపై మొత్తం 12 దేశాలు ఆంక్షలు విధించాయి. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నాయి.
ఇలా ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి. అయితే, ఈ ఆంక్షలపై చైనా భగ్గుమంది. తాము కూడా ఆ దేశాలకు ధీటుగా జవాబు చెప్తామని హెచ్చరించింది.
చైనాను లక్ష్యం చేసుకొని కొన్ని దేశాలు మితిమీరిన ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదని, ఆయా దేశాలు అనుసరిస్తున్న ప్రవేశ పరిమితులకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చర్యలను రాజకీయ లక్ష్యానికి ఉపయోగిస్తే.. తాము దానికి దీటుగా ప్రతిస్పందిస్తామని ఆమె హెచ్చరించారు.
ఇలా ఉండగా, షాంఘైలో దాదాపు 2.5 కోట్ల మందికి (70% జనాభా) కరోనా సోకిందని సీనియర్ డాక్టర్, కరోనా నిపుణుల సలహా సంఘం సభ్యుడు చెన్ ఎర్ఝెన్ తెలిపారు. జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసిన తర్వాత కేసులు భారీగా పెరిగాయని చెప్పారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. షాంఘైలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు.
ఇప్పటికే బీజింగ్, తియాంజిన్, చోంగ్ కింగ్, గాంగ్ ఝౌలో వైరస్ పీక్ దశకు చేరిందన్నారు. షాంఘైలోని తమ ఆస్పత్రికి రోజూ 1600 ఎమర్జెన్సీ కేసులు వస్తున్నాయని, జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసే ముందున్న సంఖ్య కన్నా ఇది రెండింతలని ఆయన వివరించారు.