సీనియర్ నటి జమున (86) శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ సహా దక్షిణాదిన పలువురు సూపర్ స్టార్స్ సరసన ఆమె నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆమె మరణం టాలీవుడ్కి తీరని లోటు. జమున మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది.
1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. అంతే కాదు మా భూమి అనే నాటకంలోనూ జమున కీలక పాత్ర పోషించి, అందర్నీ మెప్పించారు.
అలా ఆమె అభినయం నచ్చి 16 ఏళ్ల వయసులోనే పుట్టిల్లు (1953) అనే సినిమాలో ఆమెకు నటిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించిన జమున… తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలా అంచలంచెలుగా ఎదిగి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఆమె 198 సినిమాల్లో నటించారు.
1965లో జూలూరి రమణారావును జమున వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో రమణారావు గుండెపోటుతో మరణించారు. కాగా జమున, రమణారావు దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.
బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావళి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలు బొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, వినాయకచవితి, లేత మనసులు, చదరంగం లాంటి మంచి సినిమాల్లో నటించి గొప్ప పేరు కూడగట్టుకున్నారు.
ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర సత్యభామ. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జమున జీవించారు. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం రాజపుత్ర రహస్యం.