పోలవరం డయాఫ్రం వాల్ ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ విసురుతోంది. 2020లో వచ్చిన భారీ వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని కూడా అదుపు చేస్తోంది. డయాఫ్రం వాల్ను పూర్తిగా పునర్నిర్మాణం చేయటమా, దెబ్బతిన్న కట్టడాన్ని తొలగించి అక్కడి వరకే నిర్మాణాన్ని పరిమితం చేయటమా అనేది ఇంతవరకు కొలిక్కి రాలేదు.
ఇప్పటికే ఎన్నో ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థలతో అధ్యయనం చేయించిన కేంద్ర జలశక్తి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (జాతీయ జలవిద్యుత్ బోర్డు – ఎన్.హెచ్.పి.సి) కొత్తగా అందించే నివేదిక మేరకు తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చేనెలలోనే డయాఫ్రం వాల్ నిర్మాణంపై తుది నిర్ణయాన్ని ప్రకటించి ఆ మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన డిజైన్ కు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తున్నది.
దీనిపై ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ)కు మార్గ నిర్దేశం చేసినట్టు తెలిసింది. డయాఫ్రం వాల్ను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేదనీ, కట్టడం ఎంత వరకు ధ్వంసమై నిరుపయోగంగా ఉందో ఆ మేరకు సమాంతర డయా ఫ్రం వాల్ను నిర్మిస్తే సరిపోతుందని ఎన్ హెచ్ పీఎస్ బృందం ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
దీని కోసం చేపట్టాల్సిన సాంకేతిక చర్యలను ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి 5 లోపు తుది నివేదికను అందించనున్నట్టు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో నిష్ణాతులైన ఎ.ఎస్.రాజు, గోపాలకృష్ణ, హర్వీందర్సింగ్, హసన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఛైర్మన్ పాండ్యా తదితరులు ఈ విషయమై లోతుగా పరిశీలనా జరుపుతున్నారు.
గతంలో వేర్వేరుగా అందించిన నివేదికలకు ఎన్.హెచ్.పి.సి తాజా అధ్యయనం కూడా దగ్గరగా ఉండే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు. పోలవరం డయాఫ్రం వాల్ పై కేంద్ర జలశక్తి ఇప్పటికే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-చెన్నై ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) వాటిని అధ్యయనం చేసింది. ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, రిటైర్డు ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను కూడా కొంత మేర పరిగణలోకి తీసుకుంది.