కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మొత్తంగా రూ. 12,800 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ. 4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టులకు కాగా, ఏపీలోని ప్రాజెక్టుల కోసం రూ. 8,406 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2009-2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
బడ్జెట్లో తెలంగాణకు భారీగా కేటాయింపులు జరిగాయని, చాలా చోట్ల అండర్ పాస్లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం జరుగుతోందని రైల్వే మంత్రి వైష్ణవ్ వివరించారు. వీటిలో డబ్లింగ్, ట్రిపులింగ్ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో రోజువారీ సరుకులు కూడా ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు ప్రయాణికుల మంచి స్పందన వస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే దేశంలో చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫీజుబులిటీ పరిశీలించాల్సి ఉందని చెప్పారు. తెలంగాణలో ఎంఎంటీఎస్ కోసం రూ. 600 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్రం చేయాల్సింది చేస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అశ్విని వైష్ణవ్ కోరారు.