దేశంలో ఉన్న చైనీస్ మొబైల్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. పన్నులను ఎగవేసేందుకు ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటి కే పలు దర్యాప్తు సంస్థలు చైనా కంపెనీలపై నిఘా పెట్టాయి.
గతంలో చైనా సంస్థలు నిర్వహిస్తున్న మొబైల్ లోన్ అప్లికేషన్, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలపై పలు ఏజెన్సీలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొన్ని చైనా సంస్థలపై తనిఖీలు మొదలయ్యాయి.
ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ఐటీశాఖ ఆధ్వర్యంలో పలు బృందాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. తయారీ సంస్థలతో పాటు పలు కార్పొరేట్ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.
దేశంలో ఒప్పో, షావోమీ సంస్థలకు చెందిన పంపిణీదారు భాగస్వాముల ఆఫీసులు, ఈ కంపెనీల్లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు, డైరెక్టర్లు, సీఎఫ్వో తదితరుల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అక్కడ నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్లో టెలికాం ఉత్పత్తులను తయారీ చేసే జెడ్టీఈ సంస్థ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఫోన్ల తయారీ యూనిట్లు, గోదాములను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఈ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు కూడా సోదాలు జరిపిపారు. ఒప్పోకు చెందిన ఒక పంపిణీదారు కంపెనీకి ఇడి కోట్లాది రూపాయల జరిమానా కూడా విధించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.