తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వంకు రాష్త్ర హైకోర్టులో చుక్కేదురైంది. మార్చి 14 వరకు బదిలీలు చేపట్టవద్దని, అప్పటి వరకు ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. టీచర్ల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధించిన రాష్ట్ర హైకోర్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు పలు నిబంధనలు విధించింది. ప్రక్రియ కొనసాగుతుండగా, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. వీటిపై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తం అవటంతో విచారణ జరిపిన హైకోర్టు బదిలీలపై స్టే విధించింది.
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జనవరి 28న మొదలు కాగా దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జీవో 317 ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన టీచర్లు తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి కేవలం ఒక సంవత్సరమే అవుతోందని, దీంతో ప్రస్తుత బదిలీలకు తమకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంత మంది టీచర్లు ఈ అంశంలో హైకోర్టుని ఆశ్రయించగా, ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25 వేల మంది ఉన్నందున ప్రభుత్వం వారి విజ్ఞప్తులను పరిశీలించాలని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలోని సర్వీసు కాలాన్ని కూడా కలిపి, వాటి ఆధారంగా బదిలీలు చేపట్టాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో బదిలీల ప్రక్రియ నిలిపివేయాలా లేక నిబంధనల్లో మార్పులు చేయాలా అనే అంశంపై సర్కార్ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపింది. చివరికి నిబంధనల్లో మార్పునకే మొగ్గు చూపి, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 317 జీవోతో బదిలీ అయిన టీచర్ల పూర్వ జిల్లా సర్వీసుని కూడా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.
బదిలీకోసం దరఖాస్తు చేసుకునేందుకు వికాసం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా బదిలీ అయిన టీచర్లు, ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయంపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదించారు.
ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిబంధనలు రూపొందించే అధికారం చట్ట సభలకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఆ ప్రక్రియను పాటించకుండా అధికారులు జీవో రూపంలో నిబంధనలు జారీ చేశారని పేర్కొన్నారు.
ఇవి తెలంగాణ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. ఉపాధ్యాయ దంపతులు, యూనియన్ నేతలకు ప్రభుత్వం అదనపు పాయింట్లు కేటాయించడాన్ని తప్పు పట్టిన పిటిషనర్లు రాజ్యాంగం ప్రకారం ఉద్యోగులందరికీ సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధించింది.