వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మళ్లీ ఆమె పాదయాత్రకు అనుమతి రద్దు చేసి, అరెస్ట్ చేశారు. మహబూబాబాద్లో నోటీసులు ఇచ్చిన అనంతరం.. షర్మిలను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన ఆమె ఎమ్మెల్యే శంకర్ నాయక్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈక్రమంలోనే ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు.
వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్తగా పోలీసులు కూడా భారీగా మోహరించారు.
మహబూబాబాద్లో వైఎస్ షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొజ్జాల్లా ఉన్న కొందరు ఆంధ్రా వలస వాదులు వస్తున్నారని అభ్యంతరకర కామెంట్స్ చేశారు. పర్యటనలు చేసుకుంటే చేసుకోండి కానీ.. మాట్లాడే భాష అదుపులో లేకుంటే మాత్రం.. కంకర రాళ్లకు మరోసారి పనిచెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలకు కనుసైగా చేస్తే చాలు.. తరిమి తరిమి కొడతారని బెదిరించారు.
శంకర్నాయక్ కామెంట్స్పై అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు షర్మిల. నెళ్లికుదురు మండల కేంద్రంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆమె.. శంకర్నాయక్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ” శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా..” అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
”శంకర్ నాయక్ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు. శంకర్ నాయక్.. సైగ చెయ్ ఎవగడొస్తాడో చూస్త. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ” అంటూ ఆమె హెచ్చరించారు.
“ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా..?. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా? మీరు నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. శంకర్ నాయక్ ఒక కబ్జా కోరు. జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు.” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. శంకర్ నాయక్ని పరుష పదజాలంతో దూషించారని టిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి.. అరెస్ట్ చేశారు.