కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ సర్వే పనులు ప్రారంభించింది. సముద్ర తీర ప్రాంతంలో భూ నాణ్యత ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తోంది. బెర్తులు ఎంత లోతులో నిర్మిస్తే పటిష్టంగా ఉంటాయో గుర్తించేందుకు మట్టి శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు కసరత్తులు తుది దశకు చేరాయి. మొదటి దశలో మూడు కార్గో, ఒకటి సాధారణ బెర్త్లను నిర్మించనున్నారు. బొగ్గు, ఇనుప ఖనిజం రవాణాకు ప్రత్యేకంగా ఒక బెర్త్ ను కేటాయిస్తున్నారు.
ఈ నాలుగు బెర్తుల నిర్మాణానికి మొత్తం రూ.5,253.89 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించారు. రూ.3,683.83 కోట్లకు మెఘా సంస్థ టెండర్ తగ్గించుకుంది. పనులు ప్రారంభమైన తర్వాత 30 నెలల్లో పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. పోర్టు నిర్మాణానికి ఇప్పటికే పర్యావరణ అనుమతులు వచ్చాయి.
మచిలీపట్నం పోర్టు కు జాతీయ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ.3940 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన సముద్ర తీర ప్రాంత భూముల సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను రెవిన్యూ శాఖ పూర్తి చేసింది. నాలుగు గ్రామాల్లో 1,688.44 ఎకరాలను సబ్ డివిజన్ చేసింది.