కృష్ణనదిపై తలపెట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణికి కేంద్రం ఆమోదించింది. నిధులు కూడా కేటాయించింది. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చేసి మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దేందుకు రూ. 1,082.56 కోట్ల అంచనావ్యయాన్ని ప్రతిపాదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 500 కోట్లను కేంద్రం కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అవసరమైన అన్ని అనుమతుల పక్రియ పూర్తయి ఈప్రాజెక్టును ప్రారంభిస్తే 30 నెలలలోగా పూర్తి అయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల, ఏపీలోని నంద్యాల జిల్లా లలితా సంగమేశ్వరం మధ్య కృష్ణా నదిపై కేబుల్ కం సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది.
పూర్తిగా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కృష్ణా నదీమీదుగా బ్రిడ్జిపై ప్రయాణం సాగనుంది. ప్రతిపాదిత సోమశిల -సిద్దేశ్వరం వంతెన తెలంగాణ ఏపీలోని రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని పెద్ద ఎత్తున తగ్గించనుంది.
కాగా, ఇప్పటివరకు సోమశిల నుంచి ఏపీలోని నంద్యాలకు వెళ్లాలంటే పడవ ప్రయాణం మాత్రమే ఉంది. బ్రిడ్జి నిర్మాణం తో కాలినడకన వెళ్లేందుకు కూడా అవకాశాలున్నాయి. అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, ఏపీ నంద్యాల జిల్లా ఆత్మకూర్ మధ్య రోడ్డు మార్గంలో దాదాపుగా 175 కిలోమీటర్లు ఉండగా, ఈ వంతెనతో ప్రయాణ దూరం తగ్గుతుందని అధికారులు చెప్పారు.
అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య దూరం 80 కిలో మీటర్లు తగ్గనుంది. నల్లమల పరిధిలోని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పై ఉన్న సుందరమైన ప్రదేశంతో ఈ వంతెన పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అవకాశాలున్నాయని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు.
ఈ వంతెనపై గాజుతో కూడిన పాదాచారుల నడక మార్గం, ఆలయ గోపురం లాంటి పైలాన్ లు, సిగ్నేచర్ లైటింగ్, పెద్ద నావిగేషన్ స్పాన్ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలను తీర్చిదిద్దనున్నారు. బ్రిడ్జి చుట్టూ నల్లమల అడవులు, కొండలు, జలపాతాలతో పాటుగా అందమైన పరిసరాలు, కృష్ణా నదీ సోయగాలను ఎత్తునుంచి చూసే అవకాశాలుండటంతో పర్యాటకరంగం అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలున్నాయి.