విశాఖపట్నం తాజాగా రెండు అంతర్జాతీయ సమావేశాలకు సిద్ధమవుతోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇక అదే నెల 28, 29 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు రెండు రోజుల పాటు ఇక్కడే నిర్వహిస్తున్నారు.
ఒకే నెలలో రెండు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి సమావేశాలు విశాఖలో జరగనుండడంతో విశాఖ నగరపోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 3, 4 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా నగరానికి తరలి రానున్నారు.
ఇప్పటి వరకు 6100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఆరుగురు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు హాజరు కానున్నారు. వీరితో పాటు మరో 282 మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల సదస్సులో పాల్గొంటున్నట్లు సీపీ తెలిపారు.
వీరందరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ఉన్నత స్థాయి అధికారులు, ముఖ్య అధికారులు పెట్టుబడుల సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. ఎక్కువ మంది విదేశీయ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు నగరానికి రానుండడంతో భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరు ప్రయాణించే రహదారులు, పాల్గొనే సభాప్రాంగణ ఆ తరువాత పర్యటించే ప్రాంతాల్లోనూ విస్తృతంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో వైపు జీ-20 సమావేశాలకు సంబంధించి 49 దేశాలకు చెందిన విదేశీయుల బృందం 28, 29 తేదీల్లో నగరంలో పర్యటించనున్నారు. ఇందులో సుమారు 150 మంది విదేశీయులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తరలిరానున్నారు.