ప్రస్తుతం జరుగుతున్న ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఆర్జెడి, ఎస్సిఇఆర్టి డైరెక్టర్ ప్రతాప్రెడ్డిపై ఎన్నికల కమీషన్ ఆంక్షలు విధించింది. అతను పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఎటూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతాప్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిబ్రవరి 24న ఆదేశాలు జారీ చేశామని శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రమణ్యంకు మీనా లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం ఐఎఎస్, ఐపిఎస్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల జీవిత భాగస్వామి ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నా, రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నా అటువంటి అధికారుల పర్యటనలు, సెలవులపై ఆంక్షలు ఉంటాయని తెలిపారు. అటువంటి వారిని రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా చూసుకోవాలని వివరించారు.
ప్రతాప్రెడ్డి భార్య రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, కాబట్టి ఈ నిబంధనలు ఆయనకు వర్తిస్తాయని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలంటే ప్రతాప్రెడ్డి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకుండా చూడాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు.
ఏదైనా కారణాల వల్ల ప్రధాన కార్యాలయాన్ని వదిలిపెట్టాల్సి వస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాతపూర్వక అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించినట్లు వివరించారు.