‘‘తెలంగాణ భూపోరాటంలో నిజాం చెంచాలకు ముచ్చెమటలు పట్టించిన బంజారా పోరాట యోధుడు జాఠోత్ ఠానూ నాయక్. నమ్మిన సిద్ధాంతంకోసం, బంజారాల హక్కుల కోసం జాటోతూ ఠాను నాయక్ కుటుంబం నిజాం పోలీసులతో ప్రభుత్వంతో పోరాడి నేలకొరిగింది. ఠానూ నాయక్ స్పూర్తితో గిరిజనులంతా ఏకమై పోడు భూములకు పట్టాలు, గిరిజన రిజర్వేషన్ల అమలు కోసం కేసీఆర్ సర్కార్ పై పోరాడండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
జనగామ జిల్లా గిర్ని తండాకు వచ్చిన సంజయ్ పార్టీ నేతలతో కలిసి బంజారా యోధుడు జాఠోత్ ఠానూ నాయక్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోజు రాళ్లు రప్పలతో గుట్టలున్న 77 ఎకరాలను తొలిచి సారవంతమైన భూములుగా మార్చి ధాన్యరాశులు పండిస్తున్న ఠానూ నాయక్ తండా పై నిజాం చెంచాల కండ్లు పడ్డాయని తెలిపారు.
పన్ను కట్టాలి లేకుంటే ఆ భూముల్ని లాక్కుంటాం అని పోలీసుల సాయంతో నిజాం అనుచరులు దాడి చేయగా భూమి మాది, శ్రమ మాది, పండిన పంట కూడా మాదే అని తండావాసులు తిరగబడ్డారని, ఠాను నాయక్ ఆరుగు అన్నదమ్ములు ఈ పోరాటంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు.
నిజాంపోలీసులకు ఠానూ అనుచరులకు మధ్య నెలల తరబడి పోరాటం జరగడంతో తండా వాసులపై నిజాం పోలీసులు అరాచకం చేశారని, భూములు నిజాం కు అప్పగిస్తే తండావాసులందరిని వదిలిపెడతాం అని చెప్పారని పేర్కొన్నారు. “మా భూమి మీకెందుకు ఇస్తాం అని ఠాను సోదరులు తిరగబడ్డారు. గెరిల్లా పోరాటం చేశారు. ఠాను నాయక్ ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులు ఠానూ నాయక్ ఇద్దరు సోదరుల్ని గడ్డివాములో వేసి సజీవ దహనం చేశారు” అని తెలిపారు.
అయినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం తన కళ్లముందే తన ఇద్దరు కుమారుల్ని నిట్ట నిలువునా కాల్చేస్తున్నా ఠాను నాయక్ తండ్రి హాము నాయక్ నోరు విప్పలేదని, చివరికి నిజాం పోలీసుల కుట్రలో ఠానూ నాయక ఒక తండా లో దొరికాడని చెప్పారు.
పోరాటం వదిలిస్తే… ఠానూ నాయక్ ను ప్రాణాలతో వదిలేస్తామని పోలీసులు చెప్పారని, అయితే గిరిజనుల భూములపై హక్కుల కోసం చివరి వరకు పోరాడుతా కాని… నీచ నిజాంకు, ఆయన అనుచరులకు లొంగను అని ఠానూ చెప్పాడని గుర్తు చేశారు. చివరికి ఎడ్ల బండి చక్రాలకు ఠానూను కట్టేసి నిజాం పోలీసులు గుళ్ల వర్షం కురిపించి చంపారని వివరించారు.
గిరిజన భూ పోరాటాలు మందలై 70 ఏళ్లు దాటినా నేటికీ వారి సమస్యలు తీరకపోవడం బాధాకరం అంటూ ఇప్పటికి పోడు భూముల కోసం గిరిజనులు పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడగానే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పినాడని, ఇప్పటికీ 5 సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిండని గుర్తు చేశారు.
ఎలక్షన్లురాగానే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని కేసీఆర్ గత 5 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నడని ధ్వజమెత్తారు. ఠానూ నాయక్ స్పూర్తితో గిరిజనులంతా ఏకమై కేసీఆర్ సర్కార్ పై పోరాడాలని పిలుపిచ్చారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ అండగా ఉంటూ పోరాడుతుందని స్పష్టం చేశారు.