కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ కొత్త ఫ్లూ దేశ ప్రజలను వణికిస్తున్నది. ఇన్ఫ్లుయెంజా ఎహెచ్3ఎన్2 కొత్త ఫ్లూ ప్రభావంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పల్లెలు మొదలు పట్టణాల వరకు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే వైరస్ హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా అని ఈ వైరస్ సాధారణంగా ఏటా ఈ సమయంలో మార్పులకు లోనవుతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా చెప్పారు. అయితే..పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ కరోనా లాగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని హెచ్చరించారు.
కాబట్టి.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు దరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం మనం ఇన్ఫ్లూయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఏటా ఈ టైంలో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంటుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అయితే..ఈ వైరస్ ఏటా మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. కొన్నేళ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్తో సంక్షోభం వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది హెచ్3ఎన్2 రకం వైరస్. ఇది సాధారణ ఫ్లూ వేరియంటే. అయితే..వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది.
దీంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. అయితే..ఇదేమంత ఆందోళనకరమైన అంశం కాదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదు అని డా. గులేరియా వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవుతుంటుందని చెప్పుకొచ్చారు.
ఈ కొత్త ఫ్లూ ప్రభావంతో ప్రస్తుతం ప్రతీ ముగ్గురిలో ఒకరు జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలకు సరైన సమయంలో చికిత్స తీసుకోని పక్షంలో జ్వరం తరువాత న్యుమోనియా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
అలాగే, ఈ ఫ్లూ నుంచి కోలుకున్న తరువాత కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండోచ్చనీ, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని చెబుతున్నారు.