తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతివనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు.
అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభతేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా.అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్… త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిజానికి ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎమ్యెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా… ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రకటించింది.
తెలంగాణ సచివాలయ భవనాన్ని 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2021 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది.
కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు.
ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు.