ఈ నెల 30న శ్రీరామ నవమి పండుగ నేపధ్యంలో రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాదిగా భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో స్వామివారి కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాల కోసం భక్తులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జిల్లా కలెక్టర్ అనుదీప్ సారధ్యంలో సమీక్ష నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. ఇప్పటి వరకు 200 క్వింటాల తలంబ్రాలు, ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించేందుకు 6 భారీ ఎల్సీడీలు, తెప్పోత్సవం వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
200 మంది స్విమ్మర్లు, 135 వివిధ రకాల బోట్స్, ఎక్కడికక్కడ తగు సిబ్బంది, సిబ్బంది వారి విధులకు అనుగుణంగా జాకెట్స్, 75 శాతం వసతి సౌకర్యాలు, పబ్లిక్ టాయిలెట్స్, విద్యుత్ దీపాలు, 4 ఫైర్ ఇంజన్లు, సిగ్నల్ ఇబ్బంది లేకుండా క్షుణ్ణమైన సమాచారం కోసం 30 ప్రత్యేక హ్యాండ్ సెట్స్(వాకీస్) తదితర ఎర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు డీపీఆర్ఓ అధ్వర్యంలో 25 సమాచార కేంద్రాలు ఎర్పాటు చేయనున్నారు.
సీతారామ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే అశేష భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఈ సారి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్వామివారి ప్రసాద లడ్డూలను అధిక సంఖ్యలో పెంచి, విరివిగా కౌంటర్ లను ఎర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
కోరిక మేరకు తలంబ్రాలు విరివిగా అందుబాటులొ ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఎర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, కళ్యాణంకు వచ్చే భక్తులు వేసవి తాపానికి గురై అనారోగ్యం పాలు కాకుండా బ్లీచింగ్ ను ఎప్పటికప్పుడు వెదజల్లుతు పరిశుభ్రత పాటిస్తూ, ఓఆర్ ఎస్, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ను అందుబాటులో ఉంచి ఉచితంగా అందించాలని తెలిపారు.