ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ చర్యలు చేపట్టింది. ఆనం రామనారయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేశామని, దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల తెలిపారు. దర్యాప్తులో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా పార్టీ గుర్తించిందని సజ్జల చెప్పారు.
ఒక్కో ఎమ్మెల్యేను చంద్రబాబు రూ. 15 నుంచి రూ. 20 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఉండవచ్చునని సజ్జల పేర్కొన్నారు.
కాగా, ఈ నలుగురు టీడీపీలోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ విమర్శలు, సెటైర్లే వేస్తూ వచ్చారు. కొన్నిసార్టు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటంటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూసింది.
ఇంకేముంది పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది జగన్ పార్టీ. అయితే.. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి వివరణ ఇచ్చారు. ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానని తెలిపారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం దీనిపై నోరు మెదపలేదు. మరోవైపు.. ఆనం, కోటంరెడ్డికి టీడీపీ టిక్కెట్లు కాన్ఫమ్ అయ్యాయని తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరూ టీడీపీ నుంచే పోటీ చేస్తారని సమాచారం. కానీ, మిగిలిన ఇద్దరికీ అటువంటి హామీలు ఏమీ లేవని చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ శుక్రవారం టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.