బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నయ్ కదా.. ఆ హామీ ఏమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. సోమవారం ఆర్టీసీ క్రాస్రోడ్డు వద్ద దేవి థియేటర్లో “బలగం” సినిమాను జిల్లాల అధ్యక్షులతో కలిసి ఆయన వీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బలగం సినిమా తీసి మానవ సంబంధాలు, కుటుంబ బంధాల గురించి అద్భుతంగా చెప్పిన డైరెక్టర్ వేణుకు నా హ్యాట్సాఫ్ అని అభినందించారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవిఐ) బిడ్డింగ్ లో పాల్గొంటానడం చూస్తే నవ్వొస్తుందని పేర్కొన్నారు.సక్రమంగా జీతాలే ఇయ్యలేని ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడడం శోచనీయమని విమర్శించారు.
ప్రభుత్వం దగ్గర నిధులుంట నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరించాలని, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపించాలని, కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీలో 5 వేల మందికి ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్నటిదాకా అవమానించిన ఆంధ్రోళ్ల పట్ల అంత ప్రేమ ఎందుకొచ్చింది? ఉత్తరాంధ్రలోనున్న వైజాగ్ స్టీల్ పట్ల అంత ప్రేమ ఎందుకు? అని ప్రశ్నించారు.
సింగరేణిని వేల కోట్ల సొమ్మును దోచుకుని సంస్థను దివాళా తీయించి ఫిక్స్ డ్ డిపాజిట్లను తీసి జీతాలిచ్చే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ పెడుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
వరంగల్ కమీషనర్ అవినీతి చిట్టా త్వరలోనే
కాగా, టెన్త్ పేపర్ లీక్ కేసులో తనను మొదటి ముద్దాయిగా పేర్కొని, అరెస్ట్ చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ అవినీతి, అక్రమాల చిట్టాను త్వరలోనే బయపెడతానని సంజయ్ కుమార్ వెల్లడించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. సిపికి చిత్తుశుద్ధి ఉంటే ఆయన ఫోన్ కాల్ లిస్ట్ ను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.