2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృస్టించడంతో పాటు, నాటి ప్రతిపక్షం వైసిపి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్న `కోటి కత్తి’ ఘటనలో ఎటువంటి కుట్రకోణం లేదని ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఎ) స్పష్టం చేసింది. అంతేకాకుండా, నిందితుడికి నాటి అధికార పక్షం టిడిపితో ఎటువంటి సంబంధం కూడా లేదని తేల్చి చెపింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్ఐఎ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన సిఎం జగన్ను విచారణకు హాజరు కావాలని కోర్టు కోరగా, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని, అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు అనుమతించాలని సిఎం జగన్ కోర్టును అభ్యర్థించారు.
అలాగే కోడిపందాల కోసం ఉపయోగించే కత్తిని ఉపయోగించి తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు జరపాలని ఎన్ఐఎను ఆదేశించాలని సిఎం జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో సిఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు.
ఎన్ఐఎ కోర్టు ఈ పిటిషన్లను ఏప్రిల్ 13న విచారణకు స్వీకరించనున్నట్టుగా తెలిపింది. ఈ క్రమంలోనే గురువారం ఎన్ఐఎ కోర్టులో విచారణ జరిగింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేస్తూ ఈ కేసులో కుట్రకోణం లేదని తేల్చి చెప్పింది.
అదీగాక, రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్కు ఘటనతో సంబంధం లేదని పేర్కొంది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు కాదని తేలిందని చెప్పింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. జగన్ వేసిన పిటిషన్ను కొట్టవేయాలని కోర్టును అభ్యర్థించింది.
అయితే వాదనలకు సమయం కావాలని జగన్ తరఫున న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
