దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకతోపాటు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.
శనివారం ఇండియాటుడే నిర్వహించిన ‘కర్నాటక రౌంట్ టేబుల్ 2023’ ప్రోగ్రాంలో అమిత్ షామాట్లాడారు. ‘‘కర్నాటక ఎన్నికలు దక్షిణాదిలోకి బీజేపీకి ఎంట్రీ పాయింట్ గా నిలుస్తాయి. దక్షిణ భారత ప్రజలు బీజేపీని, మోడీని కోరుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచే మేం దక్షిణాదిలోకి ఎంటర్ అవుతాం” అని అమిత్ షా తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు సామాన్యుడికి ఎంతో ప్రయోజనం కలిగించాయని స్పష్టం చేశారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని అమిత్ షా హెచ్చరించారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలూ కలిసిపోతాయని స్పష్టం చేశారు. గత రెండు ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా వచ్చిన్నప్పటికీ, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు ఒకటి అయ్యాయని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో అక్రమ ముస్లిం రిజర్వేషన్ కు తమ ప్రభుత్వం ముగింపు పలికినట్టు ఆయన చెప్పారు. బీజేపీ ఎల్లప్పుడూ మార్పును అనుసరిస్తుందని చెబుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వకపోవడం వెనక అదే స్ట్రాటజీ ఉందని పేర్కొన్నారు.