భారత దేశం తన మతపరమైన విధులను నిర్వర్తించడాన్ని విశ్వసిస్తోందని, అమెరికా, రష్యా, చైనా వలే నిరంకుశ దేశంగా ఉండాలని కోరుకోవడంలేదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు .
“భారత దేశం ఇతరులకు సేవ చేయడాన్ని విశ్వసిస్తుంది, ఈ సంప్రదాయం వేదాల నుండి అనుసరించబడుతోంది. మన దేశం ధర్మబద్ధమైన దేశంగా అభివృద్ధి చెందుతోంది, అభివృద్ధి చెందిన దేశంగా తన మార్గాన్ని సుగమం చేసుకున్నందున దాని మతపరమైన విధులను నిర్వహిస్తోంది” అని తెలిపారు.
‘వేద్ సంస్కృత జ్ఞాన్ గౌరవ్ సమారోహ్’లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ అభివృద్ధి చెందిన దేశాలు ఒకదానిపై మరొకటి ఆధిక్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తాయని ఆరోపించారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ సూపర్ పవర్గా ఉండేదని, దానిని అమెరికా అధిగమించిందని, ఇప్పుడు చైనా అమెరికాను మించిపోవాలని చూస్తోందని తెలిపారు.
రష్యా, అమెరికాలు ఉక్రెయిన్ను ఓ పావుగా వాడుకుంటున్నాయని భగవత్ విమర్శించారు. తనతో ఎలాంటి సంబంధాలు ఉన్నా అవసరమైనప్పుడు భారత్ మాత్రం ఇతర దేశాలకు సాయపడిందని పేర్కొన్నారు. ‘ఉక్రెయిన్ వంటి దేశాలకు ఇండియా సాయం చేయాలనుకుంటోంది. ఇది మన దేశ వైఖరి’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు.
భారత విదేశాంగ విధానాన్ని ఆయన కొనియాడుతూ ఇదివరలో ఇండియా ఇలాంటి వైఖరిని అనుసరించేది కాదని పేర్కొన్నారు. “ శ్రీలంక ఎప్పుడూ చైనా, పాకిస్థాన్ దేశాల వైపు మొగ్గేది. తమ ఆంతరంగిక వ్యవహారాలలో ఇండియాను దూరంగా ఉంచేది. నేడు శ్రీలంకను ఇండియానే ఆదుకుంటోంది” అంటూ కొనియాడారు.
మనం ఎప్పుడూ ఇతర దేశాల సంక్షోభాన్ని మనకు అనుకూలంగా మలచుకోలేదని డా. భగవత్ స్పష్టం చేశారు. కాగా, సైన్స్ మతాన్ని పట్టించుకోదని చెప్పారు. కృత్రిమ మేధస్సు రేపటి రోజున మానవుల స్థానాన్ని తీసుకుంటాయని భయపడుతున్నారని తెలిపారు. మనుషులను సైన్స్ బయోలజికల్ యానిమల్స్ అని భావిస్తుందని, కానీ మతం అలా అనుకోదని ఆయన వివరించారు.