బెంగళూరులోని ఎడ్యుటెక్ స్టార్ట్ అప్ బైజూస్ ఫౌండర్, సీఈఓ బైజు రవీంద్రన్ ఇల్లు, కార్యాలయాలపై శనివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసం, తన కంపెనీ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రెండు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఫెమా ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు.
బైజు రవీంద్రన్ ‘బైజూస్’ పేరుతో ఒక ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్ స్టార్ట్ అప్ ను ప్రారంభించారు. అది అనతికాలంలోనే, ముఖ్యంగా కోవిడ్ లాక్ డౌన్ కాలంలో చాలా పాపులర్ అయింది. దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు ప్రారంభమయ్యాయి. అలాగే, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చాయి. ఆ తర్వాత, సంస్థ సీఈఓ రవీంద్రన్ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
ఆ దాడుల్లో వారికి కీలకమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించే, నేరానికి పాల్పడ్డారని నిర్ధారించే పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. బైజూస్ 2011 -23 మధ్య సుమారు రూ. 28 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. అలాగే, ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో రూ. 9,754 కోట్లను కూడా స్వీకరించినట్లు ఆధారాలు లభించాయి.
ఫెమా నిబంధనలను పాటించకుండా ఈ పెట్టుబడులను స్వీకరించినట్లు స్పష్టమైంది. అలాగే, 2021 ఆర్థిక సంవత్సరం నుంచి సంస్థ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ ను సిద్ధం చేయలేదని, అలాగే, అకౌంట్స్ ను ఆడిట్ చేయలేదని తేలింది. గతంలో ఈడీ జారీ చేసిన పలు సమన్లకు బైజు రవీంద్రన్ సమాధానమివ్వలేదు. దాంతో, శనివారం ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు ప్రారంభించారు.
అయతే, తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని బైజూస్ లీగల్ టీమ్ ప్రకటించింది. బైజు రవీంద్రన్ ఆస్తుల విలువ సుమారు 3.3 బిలియన్ డాలర్లని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 తేల్చింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో సంస్థ ఊహించని ప్రగతిని సాధించింది. కానీ, కొరోనా మహమ్మారి సమస్య ముగిసి, స్కూల్స్ తిరిగి ప్రారంభమైన తరువాత బైజూస్ ప్రభ తగ్గడం ప్రారంభమైంది. దాంతో, పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు సంస్థ లే ఆఫ్ కూడా ప్రకటించింది.