దేశంలో జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో రూ. 1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఏప్రిల్లో రూ. 1,67,540 కోట్లు వసూలు అయ్యాయి. ఈ ఏప్రిల్లో అంతకంటే రూ. 19,495 కోట్లు అధికంగా వసూలైనట్లు ఆర్ధిక శాఖ సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక వసూళ్లు.
రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విటర్లో స్పందిస్తూ ఇది భారత ఆర్ధిక వ్యవస్థకు గ్రేట్ న్యూస్గా ఆయన అభివర్ణించారు. దేశంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ పన్నులల వసూళ్లు పెరగడం, జీఎస్టీ ఏకీకరణ, సమ్మతిని ఎలా పెంచిందో చూపిస్తుందని తెలిపారు.
ఏప్రిల్ 2023లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 1,87,035 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 38,440 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 47,412 కోట్లు, ఐజీఎస్టీ రూ. 89,158 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ. 34,972 కోట్లు ఇంపోర్టెడ్ గూడ్స్ నుంచి వచ్చిన పన్ను ఉంది. చెస్ రూపంలో రూ. 12,025 కోట్లు వచ్చిందని ఈ ప్రకటనలో పేర్కొంది.
గత సంవత్సరం ఏప్రి ల్తో పోల్చితే ఈ సంవత్సరం ఏప్రిల్లో వసూళ్లు 12 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ. 1.49 లక్షల కోట్లు, మార్చిలో రూ. 1.60 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. 2022-23 మొత్తం ఆర్ధిక సంవత్సరానికి రూ. 18.10 లక్షల కోట్లు వసూలయ్యాయి.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. గత సంవత్సరం ఏప్రిల్లో తెలంగాణలో రూ. 4,955 కోట్లు వసూలు అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో 13 శాతం పెరిగి రూ. 5,622 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం ఏప్రిల్లో రూ. 4067 కోట్లు వసూలయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో గత ఏడాదితో పోల్చితే 6 శాతం పెరిగి రూ. 4329 కోట్లు వసూలయ్యాయి.