ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో దేశ భద్రతా బలగాలను కాంగ్రెస్ ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, జెడిఎస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ పార్టీలు కర్ణాటకలో పెట్టుబడులును ఎన్నడూ పెంచలేదని, అదేవిధంగా రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు కల్పించలేదని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర, ఆలోచన విధానాన్ని కర్ణాటక ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని బాట్లాహౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు చనిపోతే కాంగ్రెస్ టాప్ మోస్ట్ లీడర్ (సోనియా గాంధీ) కళ్లలో కన్నీళ్లు తిరిగాయని మోదీ గుర్తు చేశారు. చిత్రదుర్గ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ భద్రతా బలగాల సామర్థాన్ని కాంగ్రెస్ శంకించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రొత్సహించిందో మీరు చూశారని చెబుతూ కర్ణాటకను ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాలకు కాంగ్రెస్ వదిలేసిందని విమర్శించారు. అయితే, ఉగ్రవాదుల వెన్నువిరిచి బుజ్జగింపులకు బిజెపి అడ్డుకట్ట వేసిందని ప్రధాని తెలిపారు. సంపన్నమైన కర్ణాటక రాష్ట్రం సురక్షితంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని, వారంటీని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
వారంటీలేని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న ఎన్నికల హామీలు అబద్ధాలు తప్ప మరోటి కాదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్పార్టీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించరని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసని అందుకే అబద్ధపు హామీలను ప్రకటిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్కు ఉన్న మరో అజెండా దూషించడం, ప్రజలను రెచ్చగొట్టడమని మోదీ ఆరోపించారు.
ఒబిసి, లింగాయత్ కమ్యూనిటీని దూషించారని, తనను తొంబై మార్లకిపైగా దూషించి సెంచరీ దిశగా కాంగ్రెస్ నేతలు పయనిస్తున్నారని ప్రధాని తెలిపారు. చిత్రదుర్గకు చెందిన దివంగత మాజీ సిఎం ఎస్ నిజలింగప్పను కూడా కాంగ్రెస్ వదలలేదని చెప్పారు. దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా కర్ణాటకను నిలిపేందుకు బిజెపి మేనిఫెస్టో రోడ్మ్యాప్గా మోదీ పేర్కొన్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కర్ణాటక అభివృద్ధి గురించి, పిల్లల భవిష్యత్తు కోసం ఏనాడూ ఆలోచించలేదని చెబుతూ బిజెపి ప్రభుత్వాలు ఎప్పుడూ అభివృద్ధి కోసమే పనిచేస్తాయని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం తమ కుటుంబాల కోసమే పని చేస్తాయని ఆయన విమర్శించారు. బిజెపి ప్రభుత్వం స్థానిక భాషలో పరీక్ష రాయడానికి అనుమతించిందని, విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సుస్థిరత కోసం బిజెపి పని చేస్తోందని హామీ ఇచ్చారు.