మాతృ భాషలోనే విద్యార్థులకు ప్రాధమిక విద్యను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్థానిక భాషల్లో చదువు చెప్పాలని, గ్రామాల్లో ప్రతిభావంతులైన యువకులు టీచర్లుగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందుకోసం కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)నిబంధనలు పెట్టినట్లు తెలిపారు.
గతంలో విద్యార్థులు పుస్తకజ్ఞానం మాత్రమే పొందే వారిని, ఎన్ఈపీతో మార్పు వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్పై ఎన్ఈపీ ఫోకస్ పెడుతుందని, ఈ విధానాన్ని అమలు చేయడం ఉపాధ్యాయుల బాధ్యతని చెప్పారు. శుక్రవారం గుజరాత్లోని గాంధీనగర్లో ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ బైయాన్యువల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో టీచర్లను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
సమాచారం కావాలంటే గూగుల్ కూడా ఇస్తుంది కానీ టీచర్ల పాత్ర.. విద్యార్థులకు మెంటార్లలా ఉంటుందని ప్రధాని చెప్పారు. పిల్లల్ని మలచడంలో ప్రైమరీ టీచర్ది ముఖ్య పాత్ర అని అంటూ తమ కుటుంభం తర్వాత పిల్లలు ఎక్కువ టైం గడిపేది టీచర్ల దగ్గరేనని, వారి వ్యవహార శైలిని చూసి నేర్చుకుంటారని ప్రధాని తెలిపారు.
‘‘టీచింగ్ అనేది గొప్ప వృత్తి. నేనెప్పుడైనా ప్రపంచ నాయకులను కలిసినప్పుడు.. అది భూటాన్, సౌదీ అరేబియా వంటి రాచరిక పాలకులైనా సరే.. ‘భారత్ కు చెందిన టీచర్లు మాకు చదువు చెప్పారు’ అని అంటుంటారు. తన టీచర్ది గుజరాత్ అని సౌదీ అరేబియా రాజు (సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్) నాతో చెప్పారు” అని ప్రధాని వివరించారు. తాను ప్రధానిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ తన టీచర్లతో కాంటాక్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల కృషి కారణంగా గుజరాత్లో డ్రాప్ అవుట్ రేటు మూడు శాతానికి తగ్గిందని ప్రధాని చెప్పారు. తన అనుభవం గురించి మాట్లాడుతూ.. విధానాలను రూపొందించడంలో ఉపాధ్యాయులు కేంద్రానికి సహాయం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు.
మరుగుదొడ్లు లేకపోవడం వల్ల బాలికలు బడి మానేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా తాము ప్రచారం చేసి మంచి ఫలితాలు చూశామని ప్రధాని మోదీ తెలిపారు. గుజరాత్లోని గిరిజన ప్రాంతంలో సైన్స్ బోధించబడలేదు కానీ ఇప్పుడు కొడుకులు, కుమార్తెలు అక్కడ నుండి వైద్యులు అవుతున్నారని ప్రధాని చెప్పుకొచ్చారు.