రాజస్థాన్ ప్రభుత్వ సచివాలయంలో క్లెయిమ్ చేయని రూ. 2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రికవరీ చేసిన నగదులో కేవలం రూ.2వేలు, రూ.500 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమీషనర్ సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రూ 2,000 నోట్లను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన కొద్దీ గంటలకే ఇవి కంటబడటం గమనార్హం.
శుక్రవారం సాయంత్రం రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్లు చెదిరిపోయేలా బంగారం, కోట్లలో నగదు కనిపించింది. శుక్రవారం రాత్రి దాడులు చేసిన పోలీసులు.. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో ఓ బ్యాగును గుర్తించారు.
ఆ బ్యాగు నిండా నోట్ల కట్టలు ఉండడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అంతే కాదు ఈ బ్యాగులో బంగారు బిస్కెట్లు కూడా ఉండడంతో పోలీసులు మరింత షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్లో రూ.2.31 కోట్ల నగదు ఉన్నట్టు వారు గుర్తించారు. అనంతరం ఆ మొత్తాన్ని సీజ్ చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు.
ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాత్సవ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని శోధిస్తున్నామన్న ఆయన.. సీఎం అశోక్ గెహ్లాట్కు కూడా ఇదే విషయమై సమాచారం అందించామని తెలిపారు.