తిరుమలలో పటిష్ట భద్రత కోసం అన్ని దళాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ్షకుమార్ గుప్తా సూచించాడారు. తిరుమలలో ఇటీవల వరుసగా భద్రతా వైఫల్యాలు వెలుగు చూసిన నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేసే అంశంపై మంగళవారం తిరుమలలో ఉన్నతస్థాయి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో ఉండే తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం కత్తిమీదసాము వంటిదని చెప్పారు. పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో విధులను నిర్వహిస్తూ తిరుమల పేరుప్రఖ్యాతులను కాపాడాలని సూచించారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా అధికారులకు, సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్యంలో భద్రతాపరమైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలు పదిరోజుల్లో తిరుమలలో విస్తృతంగా పర్యటించి నివేదికను అందజేస్తాయని చెబుతూ ఆ మేరకు తిరుమలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎలాంటి సైబర్దాడులు జరగకుండా అత్యున్నత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మాడవీధుల్లో 24గంటల పాటు యాక్సెస్ కంట్రోల్ ఉండేలా బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్, సాయుధ దళాలను ఏర్పాటు చేసి భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. ఫేక్వెబ్సైట్ల విషప్రచారాన్ని అరికట్టడానికి ఎస్పీస్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ నిపుణులతో కూడిన కమిటీని నియమిస్తామని చెప్పారు.
బూందీపోటు, శ్రీవారి ఆలయంలో ప్రసాదాల పోటులో జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫైర్అలారం వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ అలిపిరి చెక్పాయింట్లో ఉద్యోగులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతించాలని చెప్పారు.
తిరుమలలో భవన నిర్మాణ పనుల నిమిత్తం చాలామంది కొన్నేళ్లుగా కొండపైనే బస చేస్తున్నారని, గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని తీసుకువస్తున్నారని ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఇకపై సంబంధిత కాంట్రాక్టర్లు పనుల కోసం పగటిపూట మాత్రమే కార్మికులను తిరుమలలో ఉంచి సాయంత్రానికి తిరుపతికి పంపేయాలని సూచించారు.
తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీకాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని చెప్పారు. నిషేధిత వస్తువులు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేసారు. తిరుమలలో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం క్రైం, ఐడీ పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి పిక్ పాకెట్, చిన్నపిల్లల కిడ్నాప్ వంటి నేరాలు జరగకుండా ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామని వివరించారు.