తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గానూ కలెక్టర్లకు రూ. 105 కోట్ల నిధులు విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రం అవతరించి పదేళ్లు అవుతున్న సందర్భంగా.. తెలంగాణ ప్రగతి ప్రస్థానంతో పాటు అమరుల త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ పదేళ్లలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా చేరుకుందని చెప్పారు.