నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేపట్టిన ముఠా 2 కిలోల బంగారంతో ఉడాయించింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ మోండా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు.
శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ దుకాణం వద్దకు వచ్చి సిబ్బందిని, యాజమాన్యాన్ని బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు.
షాపులో ఉన్న 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు)కు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని చెప్పి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని బాలాజీ జ్యూవెలరీ దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులక చెప్పాడు.
ఐటీ అధికారులు వచ్చి తనిఖీలు చేయరని, ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో సదరు బాధితుడు ఖంగుతిన్నాడు. వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తమ షాపునకు వచ్చిన వ్యక్తులు ఐటీశాఖ అధికారులు కాదని, దొంగల ముఠా సభ్యులని తెలిసి నిర్ఘాంతపోయారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ అధికారులతో మాట్లాడి.. బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులుగా పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్టు గుర్తించారు.
బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిలో తనిఖీల చేశారని గుర్తించారు. బంగారం దోపిడీ చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.
మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి ఆరుగురికి ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఈ చోరీ బాగా తెలిసిన వాళ్లే చేశారనే అనుమానులు బలపడుతున్నాయి. యజమాని స్థానికంగా లేడని తెలిసే ఈ చోరీకి స్కెచ్ వేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపలే పెట్టి బయట గడియపెట్టి వెళ్లిపోయారు. ఇది బాగా తెలిసిన వాళ్ల పనేనని డీసీపీ చందన దీప్తి చెబుతున్నారు.