ఒక పౌర వ్యోమగామితో సహా మొత్తం ముగ్గురు వ్యోమగాములతో చైనా మంగళవారం తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్కు మూడో విడతగా విజయవంతంగా పంపగలిగింది. వాయువ్య చైనా లోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు లాంగ్ మార్చ్ 2ఎస్ రాకెట్ ద్వారా షెంజు 16 వ్యోమనౌకను ప్రయోగించింది.
ప్రయోగించిన పది నిమిషాల తరువాత భూమికి 400మీ ఎత్తున షెంజు 16 మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది. చైనా సొంత అంతరిక్షకేంద్రం పూర్తిగా అందుబాటు లోకి వచ్చిన తరువాత వ్యోమగాములు వెళ్లడం ఇదే మొదటిసారి అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సిఎంఎస్ఎ) డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికియాంగ్ వెల్లడించారు.
ఇప్పటివరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములు కాగా, ఈసారి పౌర వ్యోమగామి కూడా వెళ్లడం విశేషం. ఇప్పుడు వెళ్లిన వారిలో మిషన్ కమాండర్ జింగ్ హైపింగ్, స్పెషలిస్ట్ ఇంజినీర్ జూ యాంగ్జూ, పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావ్ ఉన్నారు.
వీరిలో జింగ్ హైపింగ్ నాలుగోసారి అంతరిక్షం లోకి వెళ్తున్న చైనా వ్యోమగామిగా ఈయనకు రికార్డు ఉంది. షెంజు 1, షెంజు 9. షెంజు 11 అంతరిక్షయాత్రల్లో కూడా ఈయన పాల్గొన్నారు. చివరి రెండు మిషన్లకు కమాండర్గా పనిచేశారు. రెండో వ్యోమగామి గుయ్ హై చావో బీజింగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్గా ఉంటున్నారు.
అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్తున్న పౌర వ్యోమగామిగా ఘనత ఈయనదే. జూయాంగ్జూ కూడా మొదటిసారి అంతరిక్షం లోకి వెళ్తున్నారు. వీరి కన్నా ముందు షెంజు 15 వ్యోమనౌకపై అంతరిక్ష కేంద్రానికి వెళ్లి నవంబర్ నుంచి అక్కడ ఉంటున్న వ్యోమగాములు వీరు వెళ్లగానే అక్కడ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
ఇప్పుడు వెళ్లిన వారు అంతరిక్ష కేంద్రంలో వివిధ రంగాలకు సంబంధించి అనుకున్న లక్షాల మేరకు భారీ ఎత్తున ప్రయోగాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం చైనా ముగ్గురు వ్యోమగాములను పంపిన లాంగ్ మార్చ్ రాకెట్ మిషన్ 475గా రికార్డు కెక్కింది.
2030 నాటికి చంద్రుని పైకి మానవులను పంపిస్తామని లక్షంగా చైనా పెట్టుకుంది. చంద్రుని దక్షిణ ద్రువం పైని గడ్డకట్టిన నీటిపై తవ్వకాలు జరపడానికి 2025 నాటికి రెండోసారి వ్యోమగాములను పంపుతామని నాసా ప్రకటించిన తరువాత చైనా తన చంద్రయాత్రను ప్రకటించడం విశేషం.