ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది.
లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇటీవల ఈడీ దాఖలు చేసిన 4వ సప్లిమెంటరీ చార్జ్షీట్ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకొంది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. 278 పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది.
సౌత్ గ్రూప్లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్ అరోరాతో ఉన్న సంబంధాలను వారి స్టేట్మెంట్ల రూపంలో మెన్షన్ చేసింది. ముఖ్యంగా ఇండో స్పిరిట్ (ఎల్1) కంపెనీలో కవిత ఇన్వెస్ట్ మెంట్పై పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని వివరించింది.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, మాగుంట రాఘవ, అమన్ దీప్ ధల్ సహా మొత్తం 29 మందిని నిందితులుగా ఈడీ చేర్చింది. సప్లిమెంటరీ చార్జ్షీట్లో సిసోడియా పేరును చేర్చినట్లు వెల్లడించింది.
లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలంగాణ, ఏపీతోపాటు 191 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి ఆధారాలు సేకరించినట్లు తెలిపింది. 12 మంది అరెస్ట్ కాగా, శరత్ చంద్రా రెడ్డి మధ్యంతర బెయిల్పై బయట ఉన్నట్లు పేర్కొంది. ఇండో స్పిరిట్ (ఎల్1)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు అరుణ్ రామ చంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.
ఈ స్కామ్లో ఇతర విషయాల్లో పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు భాగస్వామిగా వ్యవహరించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ (ఎల్1) లో యాక్సెస్ వచ్చిందంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ను ఈడీ ప్రస్తావించింది. కవిత తెలంగాణ సీఎం కూతురని లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుకు పిళ్లై వివరించినట్లు తెలిపింది.
మరోసారి విందులో పిళ్లై ఫోన్ ద్వారా ‘ఫేస్ టైమ్’లో సమీర్ను కవితతో మాట్లాడించినట్లు వివరించింది. ఈ సందర్భంగా కవిత, సమీర్ను అభినందించడమే కాకుండా, లిక్కర్ బిజినెస్లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది.
కవిత, అరుణ్ పిళ్లైలు ఆప్ నేత, లిక్కర్ స్కామ్లో కీలకమైన విజయ్ నాయర్, దినేశ్ అరోరాలను గతేడాది ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో కలిసినట్లు పేర్కొంది. 2022లో హైదరాబాద్లోని తన నివాసంలో కవితను, సమీర్ కలిశారని, ఈ భేటీలో శరత్ చంద్రా రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ప్రస్తావించింది.
కవిత, సమీర్లతో మీటింగ్లో అనేక సార్లు ‘ఫేస్ టైమ్’లో పాల్గొన్న పిళ్లై.. హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లోనూ ప్రత్యక్షంగా హాజరైనట్లు ఈడీ చెప్పింది. ఆ తర్వాత జరిగిన చర్చల్లో రూ.100 కోట్లు కిక్ బ్యాక్ గురించి తనకు తెలిసినట్లు పిళ్లై ఒప్పుకున్నాడని పేర్కొంది.
పాలసీ రూపకల్పనకు ముందు, తర్వాత కవిత అనేక మార్లు విజయ్ నాయర్తో భేటీ అయినట్లు తెలిపింది. ఢిల్లీలో జరిగిన భేటీల్లోనూ కవితతో కలిసి పిళ్లై పాల్గొన్నాడని, ఆ తర్వాత పిళ్లై తన భాగస్వాములైన అభిషేక్, బుచ్చిబాబులతో కలిసి విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులతో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడినట్లు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చాడని స్పష్టం చేసింది.