అలుపెరగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, కేవలం ఒక్క కుటుంబం, పార్టీ ద్వారానే తెలంగాణ రాలేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సకలజనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఆనాడు బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున గోల్కండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా పోరాడారని గుర్తు చేశారు.
తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని పేర్కొంటూ తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని.. 1200 మంది అమరులయ్యారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు తెలియజేశారు.
తెలంగాణలో ఉద్యమవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగటం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా దందాలు సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు, టెండర్లలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ మాఫియాతో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
భూదందా కోసమే 111 జీవో రద్దు చేశారని అంటూ దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పేరుకే బంగారు తెలంగాణ అని.. తెలంగాణలో కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారమయ్యాయని ఆక్షేపించారు. 2014లోనే దళితులకు వెన్నుపోటు పొడిచారని.., దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
సామాన్యులు, ప్రతిపక్షాలకు ప్రవేశం లేని ప్రగతి భవన్, నూతన సెక్రటేరియట్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని, ఆదాయానికి మించిన అంచనాలు, ఇబ్బడిముబ్బిడి అప్పులు చేశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించిందని తెలిపారు. సంక్షేమ పథకాల్లో భారీ కోతలు, లక్షల కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని దుయ్యబట్టారు.