కర్ణాటకలో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక తర్వాత తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించారు.
వాస్తవానికి ఈ సంవత్సరం చివరిలోగా కర్ణాటక పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాస్త్రాలలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అన్ని రాస్త్రాలలో కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పక్షాలలో ఒకటిగా ఉంది. పైగా, మిగిలిన నాలుగు రాస్త్రాలలో నేరుగా బిజెపితో తలబడుతుంది. అయితే, పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న తెలంగాణపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తుంది.
దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణాలో పాగా వేసేందుకు కొంతకాలంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. పైగా, పలు ఎన్నికలలో కాంగ్రెస్ ను వెనుకకు నెట్టేసింది కూడా. అయితే కర్ణాటకలో సాధించిన విజయంతో వచ్చిన ఉత్సాహంతో తెలంగాణపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
“మేము ఆ పార్టీని (బిజెపి) కేవలం ఓడించలేదు.. మట్టికరిపించాము. కర్ణాటకలో బీజేపీని గట్టిదెబ్బ కొట్టాము. మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. బీజేపీని అక్కడ మట్టికరిపిస్తాము. వచ్చే ఎన్నికల తర్వాత.. తెలంగాణలో బీజేపీ కనిపించడమే కష్టంగా మారుతుంది,” అంటూ ఒక విధంగా బిజెపి కి సవాల్ విసిరారు.
కర్ణాటకలో గెలిచేందుకు బిజెపి అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని, కర్ణాటకలో బిజెపి మీడియాను, నగదును, ప్రభుత్వాన్ని అన్నింటినీ వినియోగించిందని.. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని రాహుల్ వెల్లడించారు. తెలంగాణలోనూ అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీ మాటలు వింటుంటే తెలంగాణాలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ తో పోరాడేందుకు కాంగ్రెస్ సిద్దపడుతుందా? లేదా కేవలం ముగ్గురు ఎమ్యెల్యే సీట్లున్న బిజెపిని చూసి భయపడుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీని అడ్డుకొనేందుకు బిఆర్ఎస్ తో చేతులు కలిపేందుకు సిద్దమనే పరోక్ష సంకేతం ఇస్తున్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.