మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు సహనిందితుడిగా పేర్కొంటూ వస్తున్న సిబిఐ తాజాగా నిందితుడే అని స్పష్టం చేసింది. అంతేకాదు `ఏ 8′ నిందితుడిగా కూడా పేర్కొన్నది. పైగా, తెలంగాణ హైకోర్టు నుండి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన మూడు రోజులకే, ఈ నెల 3న విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేసి, వెంటనే సొంత పూచికత్తుపై విడుదల చేసింది.
ప్రస్తుతం అరెస్ట్ అయి జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 5వ తేదీన దాఖలు చేసిన కౌంటర్లో సీబీఐ వైఎస్ అవినాష్రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి ప్రమేయం ఉందని, దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ పేర్కొంది.
ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది.
ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. ఈ దశలో భాస్కర్రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది.
కడప, పులివెందుల ప్రాంతాల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని చెప్పింది. ఆయన్ను అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్ రెడ్డి బలానికి నిదర్శనని సీబీఐ తెలిపింది. వైఎస్ భాస్కర్రెడ్డి బయట ఉంటే చాలు పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లే అని పేర్కొంది.
వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే అని.. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టమని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్రెడ్డి చెప్పడం పూర్తిగా అబద్ధమని.. కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్రెడ్డిపై గతంలో 3 కేసులున్నాయని సీబీఐ పేర్కొంది.