“తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన వారి పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
బిజెపి సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15న జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
“ఖమ్మంలో బిజెపి సత్తా ఏందో “నిరుద్యోగ మార్చ్” ద్వారా చూపించాం. రేపు అమిత్ షా సభను సక్సెస్ చేసి మరోసారి దమ్ము చూపిస్తాం” అంటూ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. ఇక్కడ అమిత్ షా సభ విజవంతమైన తరువాత అవసరమైతే ప్రధాని మోదీతో కొత్తగూడెంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అమిత్ షా సభ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాలో కూడా 70 శాతం పోలింగ్ బూత్ కమిటీలను పూర్తి చేశామని పేర్కొన్నారు. గతంలో బిజెపిని ఉరికించి కొడతామన్న నేతలకు మన సత్తా తెలిసి నోరు మూసుకున్నారని, ఎక్కడ చూసినా జనం బిజెపి పేరే ఉచ్చరిస్తున్నారని ఎద్దేవా చేశారు.