కర్ణాటక ఎన్నికలలో సగానికి సగం బలం కోల్పోయిన జేడీఎస్ రానున్న లోక్ సభ ఎన్నికలలో బిజెపితో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కొట్టిపారేసారు. లోక్సభ ఎన్నికలకు ఇతర పార్టీలతో సర్దుబాట్లు లేదా అవగావహనపై ఇప్పుడు ఎటువంటి ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే, పరిస్థితిని బట్టి అవసరం అయినప్పుడు దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీల మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక లోపాయికారి అంశంపై చర్చ జరగడం సర్వసాధారణం. ఇందులో అనేకం కేవలం ఊహాగానాలకు కూడా దారితీస్తుంటాయని కుమారస్వామి తెలిపారు.
ఇప్పుడు వెలువడ్డ వార్త కేవలం వదంతా లేక ఇందులో నిజం ఉందా? అనేదానిపై కేవలం ఎన్నికల దశలోనే లేదా ఈ ప్రక్రియల తరుణంలోనే ఏదైనా చెప్పేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.
గత ఐదు రోజులుగా తమ పార్టీలో జిల్లాలవారి సమీక్షా సమావేశాలు జరిగాయని, ఇందులో గెలుపోటములపై సమీక్ష జరిగిందని, తన పట్ల పార్టీ కేడర్ అంతా విశ్వాసం ఉంచిందని ఆయన తెలిపారు. ఈ భేటీలో ఇతర విషయాల ప్రస్తావన ఏదీ రాలేదని తెలిపిన ఆయన అవసరం అయినప్పుడు ఇతర విషయాలు చర్చకు వస్తాయని చెప్పారు.