ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ” లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి దీనిని అందజేసి సత్కరించారు. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలు అందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు ఈ పురస్కారం అందిస్తున్నారు.
1915లో దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇది 13 వ పురస్కారం కావడం విశేషం. మూడు చదరపు బంగారు యూ నిట్లతో కూడిన స్వచ్ఛమైన బంగారు కాలర్తో ఉండే ఈ పురస్కారంపై గత చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే ఫారోనిక్ పాలకుల సంకేతాలు ఉండడం విశేషం.
మొదటి యూనిట్ దుష్టశక్తుల నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశాన్ని ప్రతిబింబించగా, రెండో యూనిట్ నైలు తీసుకువచ్చే వైభవాన్ని, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మూడో యూనిట్ సంపదను, సహనాన్ని సూచిస్తుంది. ఈ మూడు యూనిట్లు మణులు, రత్నాలు పొదిగిన వృత్తాకార బంగారు పుష్పంతో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి.
ఈ పతకం మధ్యలో నైలునది పొడుచుకు వచ్చినట్టుండే చిహ్నం ఉంటుంది. అది ఉత్తర (బెరడు)దక్షిణ (కమలం) భాగాలను కలిపినట్టు కనిపిస్తుంది. అంతకు ముందు, ఈజిప్టులో అతి ప్రాచీన మసీదు అయిన అల్ హకీం ను ప్రధాని మోడ్ సందర్శించారు. మసీదు ప్రార్ధన మందిరం గోడలు, తలుపులపై చెక్కిన శాసనాలను పరిశీలించారు. 11 వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవలనే పునరుద్ధరణ పనులు చేపట్టారు. దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు ఈ పనుల గురించి మోదీకి వివరించారు.
11 వ శతాబ్దంలో కైరో లోనే అతిపెద్ద మసీదుల్లో ఈ మసీదు ఒకటి. వెయ్యేళ్ల చరిత్ర కలిగి ఉంది. 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులోని ప్రార్ధనా మందిరమే 5000 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించింది. ఫాతిమిద్కు (అరబ్ మూలాలున్న ఇస్మాయిలే షియా వర్గం ) చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల దీన్ని పునరుద్ధరించారు. భారత్లో ఈ వర్గం జనాభా సుమారు 5 లక్షల వరకు ఉంటుంది.
ఈజిప్టు రాజధాని శివారులో ఉండే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సందర్శించారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో పిరమిడ్లు ఒకటి. ఉత్తర ఈజిప్టు లోని అల్ జియా సమీపాన నైలు నది పశ్చిమ తీరంలో ఈ పిరమిడ్లు ఉన్నాయి. నాల్గవ ఫారో చక్రవర్తుల వంశానికి చెందిన ఈ పిరమిడ్లు మూడింటిని మోడీ సందర్శించారు.
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్-సిసితో ప్రధాని మోదీ ఆదివారం భేటీ అయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ వంటి అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకునే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. శనివారం మధ్యాహ్నం కైరో చేరుకున్న మోదీ ముందుగా ఈజిప్ట్ ప్రధాని మొస్తాఫా మద్బౌలీతో భేటీ అయ్యారు.